గంపలగూడెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం..
ఇంటింటికి చేరుతున్న సామాజిక భద్రత సాయం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమైంది.
మండలంలోని గంపలగూడెం, వినగడప, గోసవీడు, నెమలి, ఊటుకూరు, పెనుగొలను తదితర గ్రామాల్లో ఉదయం నుంచే అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేస్తున్నారు.
వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రత పథకం ద్వారా ఆర్థిక భరోసా లభిస్తోంది. పింఛన్ల పంపిణీతో వేలాది కుటుంబాలకు ఊరట కలుగుతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
అయితే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటివరకు పింఛన్లు మంజూరు కాకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.