గొల్లమందల లో అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు నల్లగట్ల స్వామిదాస్ అండ
గొల్లమందల లో అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు నల్లగట్ల స్వామిదాస్ అండ
నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందజేత
ఏ.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం గొల్లమందల గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రెండు నివాస గృహాలు పూర్తిగా దగ్ధమై బాధిత కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ శనివారం సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదంతో దగ్ధమైన ఇళ్లను పరిశీలించారు.
అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి తీవ్ర నష్టానికి గురైన బాధిత కుటుంబాలను పరామర్శించిన నల్లగట్ల స్వామిదాస్ వారికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయంగా నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అగ్నిప్రమాదంతో ఇళ్లు, ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో బాధిత కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు పార్టీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి బాధితులకు అందాల్సిన సహాయాన్ని త్వరితగతిన అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని, కష్ట సమయంలో అండగా నిలుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ ప్రధాన కార్యదర్శి నరేడ్ల వీరారెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు యరమల రామచంద్రరెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ విభాగ అధ్యక్షులు ధారావత్తు ధర్మరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు వంకలపాటి సాంబయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు వంకలపాటి నరసింహారావు, మాజీ సర్పంచ్ కోలా రాజారావు, పార్టీ నాయకులు మామిడి కుటుంబరావు, బొల్లెపోగు కొండలరావు, కొంగల రవీంద్ర, కంచపోగు గోపి, మలమంటి నాని, పాలెం కృష్ణమోహన్, వంకలపాటి గోపి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.