గూడెం ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మంచిర్యాల,జూన్13: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం దండేపల్లి మండలం గూడెంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి రూ.2,216 కోట్లతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గూడెం ఆలయ అభివృద్ధికి ప్రజల ఆకాంక్ష మేరకు రూ.70 కోట్ల నిధులు కేటాయించామని, 37 రోజుల్లోనే పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గోదావరి పుష్కరాల కోసం ఘాట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.1,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.రైతు సంక్షేమంలో భాగంగా గూడెం గుట్ట పరిధిలో రూ.74 కోట్ల అంచనా వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమిపూజ చేసినట్లు వెల్లడించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలో సాగు అభివృద్ధి చెందుతోందని, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు