ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మంచిర్యాలలో శ్రీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన
ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనులతో పాటు ఇతర నిర్మాణాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర షెడ్యూల్ తెగలు, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంచిర్యాల, రామగుండం నియోజకవర్గాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కమిషనర్ అన్వేష్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి రూ. 2 వేల 216 కోట్లతో చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాబోవు గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం రూ. 1 వేయి కోట్లు కేటాయించిందని, ఇందులో భాగంగా మంజూరైన రూ. 3 కోట్ల గోదావరి పుష్కరాల అంచనా నిధులతో శ్రీ విశ్వనాథ ఆలయ పునఃనిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అలాగే నగరపాలక సంస్థ పరిధిలో రూ. 1 కోటి 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న డివిజనల్ కార్యాలయాల భవన నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు