సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పార్లమెంట్లో నిరంతరం పోరాడుతా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
సింగరేణి పెన్షన్ను రూ.10 వేలకు పెంచే వరకు నా పోరాటం కొనసాగుతుంది
డిపెండెంట్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పెద్దపల్లి ఎంపీ సవాల్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి మెడికల్ ఇన్వాలిడ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు డిపెండెంట్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ గళం విప్పుతానని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం పార్లమెంట్లో నిరంతరం పోరాడుతానని, ముఖ్యంగా సింగరేణి కార్మికుల పెన్షన్ను రూ.10 వేలకు పెంచే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
గతంలో సింగరేణి సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దివంగత కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి గారు సంస్థను కాపాడటంతో పాటు, పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చి వేలాది కుటుంబాలకు న్యాయం చేశారని ఆయన గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో తాను కూడా కార్మికుల పక్షాన నిలబడతానని తెలిపారు. ఇదే సభావేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మికులపై నిజంగా ప్రేమ ఉంటే, వారి పెన్షన్ను రూ.10 వేలకు పెంచేలా చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటం, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని ఎంపీ వంశీకృష్ణ కొనియాడారు. కార్మికుల సమస్యల పట్ల అధికారులు మరింత మానవతా దృక్పథంతో వ్యవహరించి సత్వరమే పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించి, డిపెండెంట్ ఉద్యోగాలు వేగంగా అందేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆయన ప్రత్యేక వినతి చేశారు. అనంతరం "జై సింగరేణి... జై జై సింగరేణి" అంటూ కార్మికులకు తన ప్రగాఢ సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు