సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీ పడే ప్రసక్తే లేదు
సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మెడికల్ అన్ ఫిట్ ప్రక్రియలో పారదర్శకత: మంత్రి శ్రీధర్ బాబు
పదవీ విరమణ పొందిన కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు, క్వార్టర్లు ఇవ్వాలి: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
సింగరేణి కార్మికుల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో వైద్యపరంగా విధులు నిర్వహించలేని (మెడికల్ అన్ ఫిట్) సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తూ 335 మందికి ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అల్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, సత్యనారాయణ, మలోత్ రాందాస్ నాయక్, కార్మిక సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని, ప్రజాస్వామ్య రక్షణలో జాగరుకతతో ఉంటూ ఈ సంస్థను కాపాడుకుంటామన్నారు. కార్మికులకు రూ. 1.25 కోట్ల బీమా సదుపాయం కల్పిస్తున్నామని, 30 వేల మంది ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి బోనస్ అందించామని తెలిపారు. మంచిర్యాల జిల్లా అభివృద్ధిలో భాగంగా గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణకు రూ. 70 కోట్లు, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 74.40 కోట్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. కోల్ బ్లాక్లలో పూర్తి నిఘా వ్యవస్థ మధ్య పనులు జరుగుతున్నాయని, కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలతో చర్చించి కార్మిక సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ నల్ల బంగారం అయిన బొగ్గును, సింగరేణి సంస్థను సమష్టిగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మెడికల్ అన్ ఫిట్ నియామకాల ప్రక్రియలో పారదర్శకంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు రూ. 1.25 కోట్ల బీమాతో పాటు, సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా రూ. 40 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, సింగరేణి సంస్థ లాభాల్లో శాశ్వత కార్మికులతో పాటు తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు సైతం లాభాల వాటాను అందించి, ప్రభుత్వం కార్మికుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుందని మంత్రి గుర్తుచేశారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. నియామక పత్రాలు అందుకున్న 335 మందిలో 117 మంది మంచిర్యాల జిల్లా వాసులే కావడం సంతోషకరమన్నారు. సంస్థలో దీర్ఘకాలంగా ఉన్న 'మారుపేరు' సమస్య పరిష్కారానికి కమిటీ వేసి బాధితులకు తప్పక న్యాయం చేస్తామన్నారు. రిటైర్డ్ కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నామని, వారికి ఖాళీ క్వార్టర్లు కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపజేయాలని, ఆదాయపు పన్ను మినహాయింపుతో పాటు శ్రీరాంపూర్ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. 1992లో సింగరేణిని బీఐఎఫ్ఆర్ (BIFR) కిందకు పంపినప్పుడు నాటి నేత గడ్డం వెంకటస్వామి అడ్డుకొని సంస్థను కాపాడారని, ఆయన కృషితోనే నేడు కార్మికులకు లాభాల్లో వాటా దక్కుతోందని తెలిపారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు కారుణ్య నియామక పత్రాలను పంపిణీ చేశారు