గోల్డ్ షేక్హ్యాండ్ విశ్రాంత కార్మికులకు సింగరేణి ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు కల్పించాలి: విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్
మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం సమావేశంలో డిమాండ్
రూ.350 నుండి రూ.1000 పెన్షన్తో దీనస్థితిలో కుటుంబాలు: గజెల్లి వెంకటయ్య ఆవేదన
మంచిర్యాల:గత సీమాంధ్ర ప్రభుత్వ హయాంలో తప్పనిసరి పరిస్థితుల్లో 'గోల్డ్ అండ్ షేక్ హ్యాండ్' (స్వచ్ఛంద పదవీ విరమణ) పథకం కింద విరమణ పొందిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. మృత్యుగృహాల్లాంటి బొగ్గు గనుల్లో 25 నుండి 27 సంవత్సరాల పాటు తమ రక్తాన్ని చమటగా మార్చి సింగరేణి పురోభివృద్ధికి బాటలు వేసిన కార్మికులను నేడు యాజమాన్యం విస్మరించడం సరికాదన్నారు. ప్రస్తుతం వీరికి కేవలం రూ. 350 నుండి రూ. 1000 లోపు మాత్రమే కోల్ మైన్స్ పెన్షన్ వస్తోందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతోమంది విశ్రాంత కార్మికులు రోజువారీ కూలీలుగా, హోటల్ వర్కర్లుగా బతుకుబండిని లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో బీపీ, షుగర్, గుండె, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడితే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక, సరైన వైద్యం అందక ఎంతోమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గౌరవ శ్రీ వివేక్ వెంకటస్వామి, నూతన సి అండ్ ఎం డి (C&MD) బుద్ధ ప్రకాష్ జ్యోతి, మరియు గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు మానవతా దృక్పథంతో ఆలోచించి గోల్డ్ షేక్హ్యాండ్ కార్మికులకు సింగరేణి ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర సుదూర ప్రాంతాలలో నివసిస్తున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సౌకర్యార్థం.. ఏరియా హాస్పిటల్ లలో ఒకేసారి 2 నెలలకు సరిపడా మందులను పంపిణీ చేయాలని యాజమాన్యానికి, చీఫ్ మెడికల్ ఆఫీసర్కు విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు భీమ్ సేన్, కార్యదర్శి రాజేశం, నాయకులు భిక్షపతి, సదానందం, చారి, నారాయణ, అంజన్న, పోషం తదితరులు పాల్గొన్నారు