గత పదేళ్ల విధ్వంసం నుంచి వికాసంలోకి తెలంగాణ
గత పదేళ్ల విధ్వంసం నుంచి వికాసంలోకి తెలంగాణ – ప్రభుత్వ వి విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన 1,000 రోజులు పూర్తి చేసుకుని, రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో ముందుకు తీసుకెళ్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన తెలిపారు. సోనియా గాంధీ అందించిన తెలంగాణ రాష్ట్రంలో తొలి రోజు నుంచే సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం సరఫరా వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన విధ్వంసకరంగా సాగితే, మాది వికాసమైన ప్రజా పాలన అని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలను గత ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందని, ముఖ్యంగా నీటి పారుదల రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ, లోక్సభ మరియు స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు స్పష్టమైన తీర్పు ఇచ్చినా బీఆర్ఎస్ నాయకులకు ప్రజా తీర్పును గౌరవించే సోయి లేదని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్, ప్రతిపక్ష నేత బాధ్యతలను ఏదైనా దళిత నాయకుడికి అప్పగించాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేముల వీరేశం స్పష్టం చేశారు.