గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో గృహ నిర్మాణానికి అవకాశం కల్పించాలి: సీపీఎం మండల కమిటీ వినతి
విస్సన్నపేట: గత ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన సెంటున్నర ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం విస్సన్నపేట మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మండల తహసీల్దార్ కె. లక్ష్మీకళ్యాణికి వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు 300 మందికి పైగా సెంటున్నర ఇళ్ల స్థలాలు కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను తొలగిస్తున్నారని, వాటిని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే, గతంలో కేటాయించిన ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులు కాలనీ ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించడంతో పాటు, అక్కడ రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రానున్న రోజుల్లో కాలనీ అభివృద్ధి కోసం ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని నాగరాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం విస్సన్నపేట పట్టణ కార్యదర్శి మేకల జానరత్నం, మండల కమిటీ సభ్యులు వినుకొండ రంగారాణి, ఆడిమెల్లి కిషోర్, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు.