తిరువూరు డివిజన్లో యూరియా పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డీవో ఏ కుమార్
తిరువూరు, జూన్ 29: తిరువూరు డివిజన్లో యూరియా ఎరువుల పంపిణీ పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని ఆర్డీవో ఏ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో యూరియా పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీ, తహసీల్దార్లు, ఎంఏవోలు, తిరువూరు డివిజన్ పరిధిలోని పీఏసీఎస్ ప్రతినిధులు, ప్రైవేట్ ఎరువుల దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు.
యూరియా పంపిణీ పూర్తిగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని, అర్హులైన రైతులకు అవసరానికి అనుగుణంగా ఎరువులు అందించాలని అధికారులకు సూచించారు. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, నిల్వ ఉంచడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎంఆర్ఓలు, ఎంఏవోలు తమ పరిధిలో యూరియా పంపిణీని నిరంతరం పర్యవేక్షించాలని, సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.