Madanapalle: 22-A భూ సమస్యలకు పరిష్కారం.. 9 మంది రైతులకు 29.26 ఎకరాల క్లియరెన్స్
అన్నమయ్య జిల్లా | NTODAY NEWS
అన్నమయ్య జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 22-A భూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా మదనపల్లి, రాయచోటి, పీలేరు సబ్ డివిజన్ల పరిధిలో 9 మంది రైతులకు చెందిన 29.26 ఎకరాల భూములకు సంబంధించిన 22-A సమస్యలను పరిష్కరించినట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు.
సోమవారం మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, సంబంధిత పాత రికార్డులు, దస్త్రాలను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడించారు.
ఐదు నుంచి ఏడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. రైతులకు భూమి రికార్డులు సక్రమంగా ఉండటం అత్యంత కీలకమని, పంట రుణాలు, భూమి లావాదేవీలు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో వెబ్ల్యాండ్ రికార్డులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
రికార్డుల్లో ఉన్న లోపాలను సరిదిద్దడం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే జిల్లా పరిపాలన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ తెలిపారు. మిగిలిన దరఖాస్తులను కూడా వేగంగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, రెవెన్యూ అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ 22-A భూ సమస్యలు పరిష్కరించిన 9 మంది రైతులకు సంబంధిత పత్రాలను అందజేశారు. సర్వే నంబర్ సవరణలు, కొత్త సర్వే నంబర్ల చేర్పులు, అడంగల్ వివరాల సరిదిద్దడం వంటి సమస్యలతో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ చర్యలతో ఊరట లభించింది.