జూలై 3న సీఎం చేతుల మీదుగా ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు శ్రీకారం
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
జమ్మలమడుగు, జూన్ 29 (ప్రజాశక్తి): జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద జేఎస్డబ్ల్యూ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు జూలై 3న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సోమవారం పరిశీలించారు.
ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి ఉక్కు కర్మాగారం నిర్మాణ స్థలం, హెలిపాడ్, బహిరంగ సభా ప్రాంగణం, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ముఖ్యమంత్రి సందర్శించనున్న కన్యతీర్థం దేవాలయంలో చేపట్టిన ఏర్పాట్లను కూడా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. ఈ పరిశ్రమ నిర్మాణం పూర్తయితే జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చి వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, మౌలిక సదుపాయాలు, హెలిపాడ్, సభా ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన, ఆర్డీవో శిరీష, స్టీల్ ప్లాంట్ బిజినెస్ హెడ్ యోగేష్ బేడీ, ప్లాంట్ హెడ్ రాజేష్ పూరి, కార్పొరేట్ లైజనింగ్ హెడ్ కనకరావు, ఏపీఐఐసీ జెడ్ఎం శ్రీనివాసమూర్తి, పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.