గుంటూరు కలెక్టరేట్లో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
గుంటూరు కలెక్టరేట్లో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
గుంటూరు,
గుంటూరు కలెక్టరేట్లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దుర్గాభాయి, కలెక్టరేట్ ఏఓ మల్లీశ్వరి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డీఆర్ఓ ఖాజావలి మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య సమరయోధుడిగా, న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా దేశానికి, రాష్ట్రానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని పెంపొందించాయని పేర్కొన్నారు.
బ్రిటిష్ సైనికులు తుపాకులు గురిపెట్టినా వెనుకడుగు వేయకుండా తన గుండె చూపించి నిలిచిన ధైర్యానికి గుర్తుగా ఆయనకు ‘ఆంధ్రకేసరి’ అనే బిరుదు లభించిందన్నారు. ప్రజల హక్కులు, స్వాతంత్ర్యం, సామాజిక న్యాయం కోసం ప్రకాశం పంతులు జీవితాంతం పోరాడారని తెలిపారు.
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ప్రజలకు సేవలందించారని, ఆయన పరిపాలనా దక్షత, ప్రజాసేవా దృక్పథం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని డీఆర్ఓ ఖాజావలి అన్నారు.
టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం కోసం, ప్రజల కోసం ప్రకాశం పంతులు చేసిన త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.