గుంటూరులో అక్రమ ఆయుధాల కలకలం.. నకిలీ ధ్రువపత్రాలతో తుపాకులు, బుల్లెట్లు పొందిన వ్యక్తి అరెస్ట్
గుంటూరు జిల్లాలో నకిలీ ధ్రువపత్రాలతో అక్రమంగా ఆయుధాలు, బుల్లెట్లు పొందిన వ్యక్తిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తాడికొండకు చెందిన విజయహర్షగా పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి 22 రైఫిల్, ఒక బోర్ షాట్గన్, ఒక పిస్టల్, 50 బుల్లెట్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు జిల్లాలో షాప్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న విజయహర్ష, ఫోర్స్ షూటింగ్ కోసం అంటూ నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ఆయుధాలు పొందినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ఆయుధాలు పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు.
విజయవాడలోని ఓ షాపింగ్ మాల్లో జరిగిన మిస్ఫైర్ ఘటనలో కూడా విజయహర్ష కోసం పోలీసులు చాలా రోజులుగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. పొన్నెకల్లు గ్రామంలోని ఓ వెంచర్లో నిందితుడు తుపాకులతో ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం అందిందని తెలిపారు.
నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 318(4), 336(3)తో పాటు ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25(1) కింద కేసు నమోదు చేశారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.