ఒంటరి మహిళలకు గుడ్న్యూస్.. సర్టిఫికెట్ల జారీకి మరింత వెసులుబాటు
విడాకులు పొందినవారు, పెళ్లికాని ఒంటరి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఒంటరి మహిళలకు చేయూత పింఛను పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై ఒంటరి మహిళలకు ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్లతో పాటు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు కూడా జారీ చేయనున్నారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ఇప్పటివరకు ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాలపై ఆధారపడాల్సి రావడంతో అర్హులైన మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా నిర్ణయంతో ధ్రువీకరణ ప్రక్రియ మరింత అందుబాటులోకి రానుంది.
అర్హత కలిగిన ఒంటరి మహిళలు సులభంగా ధ్రువీకరణ పత్రాలు పొందడంతో పాటు చేయూత పింఛను కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కలగనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఒంటరి మహిళలకు సామాజిక భద్రత మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.