హమాలీవాడలో ఘనంగా నల్ల పోచమ్మ బోనాల జాతర
హమాలీవాడలో ఘనంగా నల్ల పోచమ్మ బోనాల జాతర
- అమ్మవారి ఆశీస్సులతో మంచిర్యాల మరింత అభివృద్ధి చెందాలి: మేయర్ శ్రీ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్, హమాలీవాడలో కొలువైన నల్ల పోచమ్మ దేవాలయంలో ఆషాఢమాస బోనాల జాతర మహోత్సవం అత్యంత ఘనంగా, వైభవోపేతంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ శ్రీమతి సల్ల రమ్య మహేష్ హాజరయ్యారు.
ముందుగా బోనాల జాతరలో పాల్గొన్న మేయర్, డిప్యూటీ మేయర్లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీ దర్ని మధుకర్ మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మంచిర్యాల పట్టణం భవిష్యత్తులో అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందేలా అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ నల్ల శంకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ సల్ల మహేష్, జోగిని నిషా క్రాంతి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, పలువురు కళాకారులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించారు. భక్తుల కోలాహలం, కళాకారుల ప్రదర్శనలతో జాతర ప్రాంగణం సందడిగా మారింది