హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ జయంతి వేడుకలు
హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భారత హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో సాయి బాబా యువజన కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికి దేశాన్ని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా నడిపించిన మహనీయుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ అని కొనియాడారు. వ్యవసాయ రంగంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి ఆధునిక పద్ధతులను రైతులకు అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
స్వామినాథన్ కృషి కారణంగా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, కోట్లాది మంది ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతి, వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆహార భద్రత కోసం ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు.
వ్యవసాయ రంగానికి, దేశ ఆహార భద్రతకు స్వామినాథన్ అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించిందని, ఆయనకు మరణానంతరం 2024లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించి గౌరవించిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో నీటిపారుదల సంఘం ఉపాధ్యక్షుడు వడ్డెరపు వెంకటేశ్వర్లు, మహిళా కమిటీ సభ్యులు, యువజన కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.