రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్
ఖమ్మం: ఉద్యోగ సంబంధిత పని చేసేందుకు రూ.14 వేల లంచం తీసుకుంటున్న గిరిజన సంక్షేమ శాఖకు చెందిన హాస్టల్ వార్డెన్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. చర్ల మండలం సత్యనారాయణపురంలోని ఐటీడీఏ ఎస్టీ బాలుర హాస్టల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
హాస్టల్లో కుక్గా పనిచేస్తున్న వ్యక్తి జీతానికి సంబంధించిన పనిని చేయడానికి వార్డెన్ భూక్యా వాల్సింహ రూ.14 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు చేపట్టి, వార్డెన్ లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడిపై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
మారుమూల ప్రాంతాల నుంచి కూడా అవినీతి, లంచాలపై ఫిర్యాదులు అందుతున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదులపై స్పందిస్తూ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.