ఇబ్రహీంపట్నంలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మూలపాడులోని బటర్ఫ్లై పార్క్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్తో కలిసి మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి స్వయంగా విత్తన బంతులు తయారు చేశారు.
అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ వంటి స్వదేశీ జాతుల విత్తనాలతో సీడ్ బాల్స్ రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మూలపాడు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించిన పవన్ కళ్యాణ్, పాల్గొంటున్న ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
జూన్ 15 నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయాలని అధికారులకు సూచించిన ఆయన, డ్రోన్ల సహాయంతో కొండ ప్రాంతాల్లో విత్తన బంతులను వెదజల్లే ప్రక్రియను పరిశీలించారు. వన సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.
అనంతరం బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసిన అటవీ శాఖ స్టాల్స్ను సందర్శించిన పవన్ కళ్యాణ్, అక్కడి యోగా హాల్ను పరిశీలించి ప్రతి ఎకో టూరిజం పార్కులో యోగా హాల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కొండపల్లి కొయ్య బొమ్మలు, ఉదయగిరి కళాకారుల చెక్క కళాఖండాలను తిలకించిన ఆయన, కళాకారుల సమస్యలను తెలుసుకున్నారు. బొమ్మల తయారీకి అవసరమైన చెక్క కొరతపై స్పందిస్తూ వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక కళారూపాలకు మార్కెటింగ్, ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి చేతివృత్తుల కళాకారులతో సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.