ఇది మన వ్యవస్థ.. రోడ్డు లేక విద్యార్థినిని భుజాలపై మోసుకెళ్లిన వార్డెన్..
మన్యం జిల్లాలో మానవత్వానికి అద్దం పట్టే ఘటన వెలుగులోకి వచ్చింది. గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని వాటాక భువనేశ్వరి తీవ్ర జ్వరంతో బాధపడుతూ పాఠశాలకు హాజరుకాలేకపోయింది.
విద్యార్థిని పాఠశాలకు రాకపోవడంతో ఆందోళన చెందిన వార్డెన్ హేమ స్వయంగా ఆమె గ్రామానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అయితే గ్రామానికి సరైన రోడ్డు, రవాణా సౌకర్యం లేకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినిని భుజాలపై మోసుకుంటూ సుమారు ఆరు కిలోమీటర్ల మేర రాళ్ల దారిలో నడిచి తీసుకెళ్లారు.
అనంతరం సమీప ఆసుపత్రిలో చేర్పించి విద్యార్థినికి వైద్య చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ఓ వార్డెన్ తన విధి బాధ్యతలను మించి చూపిన మానవత్వం, సేవాభావం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
అయితే ఈ ఘటన మరోసారి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, అత్యవసర వైద్య సదుపాయాల కొరతను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఒక విద్యార్థినిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆరు కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండటం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వార్డెన్ హేమ చేసిన సేవా భావానికి ప్రజలు, విద్యావేత్తలు, సామాజిక వర్గాలు అభినందనలు తెలియజేస్తున్నారు.