జీలుగుమిల్లి పోలీసులకు నేర పరిశోధనపై ప్రత్యేక శిక్షణ..
జీలుగుమిల్లి పోలీసులకు నేర పరిశోధనపై ప్రత్యేక శిక్షణ.. డీఎస్పీ జయకృష్ణ ఆధ్వర్యంలో పరేడ్
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం:
నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, నేరాలను ఛేదించే నైపుణ్యాలను పెంపొందించేందుకు జీలుగుమిల్లి సర్కిల్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలవరం డీఎస్పీ జయకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం జీలుగుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పోలీస్ సిబ్బందికి పరేడ్ నిర్వహించారు.
జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. యాదగిరి పర్యవేక్షణలో సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి నేర పరిశోధనపై శిక్షణ తరగతులు నిర్వహించారు. నేరం జరిగిన ప్రదేశాన్ని శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించడం, నేరస్తుల వివరాల సేకరణ, దర్యాప్తు నివేదికలను పద్ధతిగా రూపొందించడం వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
నేర స్థలాన్ని ఫోటోగ్రఫీ చేసే విధానం, సాక్ష్యాలు దెబ్బతినకుండా ఘటనా స్థలాన్ని భద్రపరిచే పద్ధతులు, అక్కడ లభించే భౌతిక ఆధారాలను శాస్త్రీయంగా సేకరించి భద్రపరిచే విధానాలను వివరించారు. అలాగే ఘటనా స్థల స్కెచ్ తయారీ, సాక్షుల వాంగ్మూలాల నమోదు, సమర్థవంతమైన దర్యాప్తులో పాటించాల్సిన నిబంధనలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
కోర్టుల్లో నేరాలు రుజువయ్యేలా పకడ్బందీగా ఆధారాలను సేకరించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దర్యాప్తులో వినియోగించాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి ఎస్సై వి. క్రాంతి కుమార్, బుట్టాయగూడెం ఎస్సై చెన్నారావు, టి. నరసాపురం ఎస్సై జయబాబు, సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బంది వృత్తిపరమైన నైపుణ్యాలు, దర్యాప్తు ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఈ పరేడ్, శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పోలవరం డీఎస్పీ జయకృష్ణ తెలిపారు.