జగనన్న తొలి రెండేళ్లు సంక్షేమ స్వర్ణయుగం.. కూటమి రెండేళ్లలో ఏమొచ్చింది? : చాట్ల రాబర్ట్
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలి రెండేళ్లలోనే సంక్షేమ పాలనకు కొత్త నిర్వచనం ఇచ్చిందని, ఎన్నికల హామీల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, రెడ్డిగూడెం వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్ పేర్కొన్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 129 హామీలలో 107 హామీలను అమలు చేసి, మరో 15 హామీల అమలుకు పునాది వేసిందని తెలిపారు. అదనంగా ఎన్నికల మేనిఫెస్టోలో లేని 40 సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిందన్నారు.
రాష్ట్రంలోని 1.64 కోట్ల కుటుంబాల్లో 1.41 కోట్ల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూర్చి, 6.60 కోట్ల మందికి రూ.95,615 కోట్లకు పైగా డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో జమ చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా ప్రజల చేతుల్లోకి డబ్బు చేరడంతో కొనుగోలు శక్తి పెరిగి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని వివరించారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో కూడా రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచి, సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా కొనసాగించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.
అమ్మ ఒడి ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు ఆర్థిక భరోసా, జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెనతో విద్యార్థుల వసతి, భోజన ఖర్చులకు సహాయం, జగనన్న గోరుముద్ద ద్వారా పోషకాహారం, జగనన్న విద్యా కానుకతో విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువుల పంపిణీ వంటి కార్యక్రమాలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని అన్నారు.
అదే విధంగా రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, ఉచిత పంటల బీమా, జలకళ, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కానుక, ఆసరా, భీమా, జగనన్న తోడు, చేదోడు, లా నేస్తం, గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ, ఆర్టీసీ విలీనం, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం, మత్స్యకార భరోసా, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని పేర్కొన్నారు.
"జగన్ పాలన తొలి రెండేళ్లలో సంక్షేమం ప్రతి ఇంటికీ చేరింది. ప్రజల ఖాతాల్లో నేరుగా డబ్బులు పడ్డాయి. కానీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఏమి దక్కింది? ఎన్నికల హామీల పరిస్థితి ఏమిటి?" అంటూ చాట్ల రాబర్ట్ ప్రశ్నించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధత ప్రస్తుత పాలకుల్లో కనిపించడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తన రెండేళ్ల పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.