జగన్ను కలిసిన జాకీర్ హుస్సేన్.. పార్టీ అండగా ఉంటుందని భరోసా
జగన్ను కలిసిన జాకీర్ హుస్సేన్.. పార్టీ అండగా ఉంటుందని భరోసా
తనపై నమోదైన కేసుల వివరాలు వివరించిన తిరువూరు వైసీపీ మైనారిటీ నేత
“అవినాష్ చూసుకుంటాడు.. పార్టీ మీకు అండగా ఉంటుంది” అంటూ జగన్ ధైర్యం
ఎన్టీఆర్ జిల్లా:
తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారంటూ తిరువూరు వైసీపీ మైనారిటీ నాయకుడు జాకీర్ హుస్సేన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఈ భేటీలో తనకు ఎదురవుతున్న పరిణామాలను జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గతంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్పై చేసిన వ్యాఖ్యలను జాకీర్ హుస్సేన్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తనపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పరంగా అండగా నిలవాలని జాకీర్ హుస్సేన్ జగన్ను కోరినట్లు తెలుస్తోంది. ఆయన వివరాలను విన్న జగన్, “దేవినేని అవినాష్ చూసుకుంటాడు.. పార్టీ అండగా ఉంటుంది” అంటూ ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తిరువూరు నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా ఉన్న జాకీర్ హుస్సేన్ నేరుగా పార్టీ అధినేతను కలవడం, తన సమస్యలను వివరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైసీపీ నాయకత్వం అండగా ఉంటుందనే సంకేతాన్ని ఈ భేటీ ఇచ్చిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.