జంగారెడ్డిగూడెంలో ఆటో డ్రైవర్లతో పోలీసుల ప్రత్యేక సమావేశం
జంగారెడ్డిగూడెంలో ఆటో డ్రైవర్లతో పోలీసుల ప్రత్యేక సమావేశం – భద్రతపై కీలక సూచనలు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆటో డ్రైవర్లతో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, మరియు ఏఎస్పీ సుస్మిత, ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ ఎం.వి. సుభాష్, ఎస్ఐ వీర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రవాణా క్రమబద్ధీకరణతో పాటు ప్రయాణికుల భద్రతపై డ్రైవర్లకు కీలక సూచనలు చేశారు. ఆటో డ్రైవర్లు కేవలం వాహనం నడిపేవారు మాత్రమే కాకుండా, తమతో ప్రయాణించే వారి ప్రాణాలకు కూడా బాధ్యత వహించాలని గుర్తుచేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు ప్రధాన రవాణా సాధనమని, అందువల్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం ప్రమాదకరమని, అదనపు లోడ్ వల్ల వాహన నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. డ్రైవర్ సీటు పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టకూడదని స్పష్టం చేశారు. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
అలాగే రహదారులపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలను నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, నిర్ణీత ఆటో స్టాండ్లలోనే వాహనాలను నిలపాలని తెలిపారు. ఆటో డ్రైవింగ్ జీవనోపాధి అయినప్పటికీ, అది ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలని హితవు పలికారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూనే, పోలీసులు ఇచ్చే మార్గదర్శకాలకు సహకరించాలని కోరారు. క్రమశిక్షణతో వ్యవహరించి ప్రమాదరహిత జంగారెడ్డిగూడెం నిర్మాణంలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.