జోగి రమేష్పై విమర్శలకు ముందు టిడిపి నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి – వైఎస్ఆర్సీపీ నేత చాట్ల రాబర్ట్
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండల పరిషత్ ఉపాధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి చాట్ల రాబర్ట్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే స్థితికి తీసుకెళ్లిందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఉచిత ఇసుక అందిస్తామని చెప్పిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తున్నారని ఆరోపించారు.
రైతుల విషయంలో ఒక కిలో తారం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు 100 కిలోలకు 10 కిలోల తారం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగా రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని తెలిపారు.
అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో మొదట అమలు చేస్తామన్న ఆడబిడ్డ నిధి విషయంలో కూడా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇలాంటి అంశాలపై ప్రశ్నించిన జోగి రమేష్పై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని, ముందుగా టిడిపి నాయకులు తమ వైఫల్యాలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.