జర్నలిస్టుల సంక్షేమమే ప్రెస్ క్లబ్ ధ్యేయం...
జర్నలిస్టుల సంక్షేమమే ప్రెస్ క్లబ్ ధ్యేయం అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి మధిర ప్రెస్ క్లబ్ డిమాండ్
మధిర, ఆగస్టు 7: సమాజంలో నిత్యం ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ, ప్రభుత్వాల పనితీరును ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మధిర ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇల్లు లేదా ఇళ్ల స్థలం కేటాయించాలని కోరింది. ఈ డిమాండ్ల సాధన కోసం త్వరలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించింది.
మధిర ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం గౌరవ అధ్యక్షుడు నాళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జీవీ, అరుణ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, అనేక కుటుంబ, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.
అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి శాశ్వత ప్రాతిపదికన ఇల్లు లేదా ఇళ్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య కార్డులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం ప్రయాణాలు చేసే జర్నలిస్టులకు రైల్వే, బస్సు ప్రయాణ పాసులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ప్రత్యేకంగా కోరారు.
ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు లిక్కీ రవీందర్, వంగూరు గోపి, సహాయ కోశాధికారి యడవల్లి శ్రీధర్, ప్రచార కార్యదర్శి అర్జున్, సహాయ కార్యదర్శులు వాసు, సుధీర్ శంకరాచారి, మహంకాళి శ్రీనివాసరావు, చారుగుండ్ల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.