జులై 2న ఏపీలో వీబీ జీ రాం జీ ప్రారంభం
కేంద్రాన్ని ఒప్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ముక్కవారిపల్లిలో జాతీయ స్థాయి కార్యక్రమం
అమరావతి, జూన్ 27: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (వీబీ జీ రాం జీ) పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. జులై 2న ఉదయం 11 గంటలకు తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.
ఇటీవల ఢిల్లీలో పర్యటించిన పవన్ కళ్యాణ్, వీబీ జీ రాం జీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరినట్లు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏపీలో కార్యక్రమం నిర్వహించేందుకు అంగీకరించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజతో పాటు తిరుపతి జిల్లా అధికారులు రైల్వేకోడూరు నియోజకవర్గంలో పర్యటించి, ముక్కవారిపల్లిని కార్యక్రమ వేదికగా ఖరారు చేశారు.
కేంద్ర ప్రభుత్వం గతంలో అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో వీబీ జీ రాం జీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్ధ వేతన ఉపాధి కల్పించడంతో పాటు ఆదాయ వనరుల పెంపు, జీవనోపాధి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
కార్మికుల వేతనాలను నేరుగా వారి బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతాల్లో జమ చేయనుండగా, జాబ్ కార్డులు లేని వారు గ్రామ పంచాయతీల్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కాగా, 2006 ఫిబ్రవరి 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవం అనంతపురం జిల్లా బండ్లపల్లిలో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త గ్రామీణ ఉపాధి పథకం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభం కానుండటం విశేషంగా మారింది.