కాకినాడలో నర్సింగ్ విద్యార్థినుల వివాదం సుఖాంతం..
కాకినాడలో నర్సింగ్ విద్యార్థినుల వివాదం సుఖాంతం.. సీఎం చంద్రబాబు జోక్యంతో సమస్య పరిష్కారం
కాకినాడ, ఆగస్టు 23:
కాకినాడలోని ఎస్కే నర్సింగ్ కాలేజీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినుల మధ్య తలెత్తిన వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో సామరస్యంగా పరిష్కారమైంది. ఘటనపై వెంటనే స్పందించిన సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు చేపట్టింది.
ఎస్కే నర్సింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల మధ్య జరిగిన ఘర్షణ విషయం ముఖ్యమంత్రి దృష్టికి చేరింది. దీంతో ఆయన వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.
విద్యార్థినుల భద్రతకు పూర్తి భరోసా కల్పించిన అధికారులు, వారికి అవసరమైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాలేజీ యాజమాన్యంతో చర్చలు జరిపి వివాదాన్ని పరిష్కరించారు.
ప్రభుత్వ యంత్రాంగం సత్వర స్పందనపై ఈశాన్య రాష్ట్రాల విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల చొరవతో సమస్య పెద్దదిగా మారకముందే సామరస్యంగా ముగిసింది.