కాంగ్రెస్ ఆగడాలకు ప్రజలే బుద్ధి చెబుతారు: మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ ఆగడాలకు ప్రజలే బుద్ధి చెబుతారు : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరిక
గజ్వేల్లోని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడిని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. నకిరేకల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతిభద్రతలు
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని, కాంగ్రెస్ గూండాల అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని లింగయ్య విమర్శించారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ నాయకులు ఏదో ఒక రకంగా అలజడి సృష్టిస్తూ రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులను నెట్టుకొస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను సాధించిన ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్bకార్యాలయంపైనే దాడి జరిగిందంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని కూడా ఆయన తప్పుబట్టారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి, కాంగ్రెస్ కార్యకర్తల్లా మారి ఇలాంటి దాడులకు వత్తాసు పలకడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజలే బుద్ధి చెబుతారు
ఇలాంటి చిల్లర దాడులకు కేసీఆర్ సైన్యం భయపడదని, కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. కాంగ్రెస్ అరాచకాలను ధీటుగా ఎదుర్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ను రాష్ట్రం నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.