కేజ్ వీల్స్తో రోడ్లపై ట్రాక్టర్లకు నో ఎంట్రీ: డీటీఓ హెచ్చరిక
కేజ్ వీల్స్తో రోడ్లపై ట్రాక్టర్లకు నో ఎంట్రీ: డీటీఓ హెచ్చరిక
మహబూబాబాద్, జూలై 19: వ్యవసాయ ట్రాక్టర్లకు అమర్చే కేజ్ వీల్స్తో ప్రజా రహదారులపై ప్రయాణిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తామని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ హెచ్చరించారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేజ్ వీల్స్ను వ్యవసాయ పనుల కోసం పొలాల్లో మాత్రమే ఉపయోగించాలని, రహదారులపై ప్రయాణించే ముందు వాటిని తొలగించి సాధారణ రబ్బరు టైర్లను అమర్చుకోవాలని సూచించారు.
వ్యవసాయ భూముల్లో బురద నేలల్లో ట్రాక్టర్కు మెరుగైన పట్టును కల్పించేందుకు కేజ్ వీల్స్ ఉపయోగపడతాయని, అయితే వాటితో బీటీ, సీసీ, గ్రామీణ రహదారులపై ప్రయాణించడం వల్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపారు. దీంతో గుంతలు ఏర్పడి ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారులు త్వరగా ధ్వంసమవడంతో పాటు ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రైతులు ఇంటి నుంచి పొలానికి వెళ్లేటప్పుడు కేజ్ వీల్స్ను ట్రాక్టర్ ట్రైలర్లో తీసుకెళ్లి, పొలం వద్ద మాత్రమే అమర్చుకోవాలని సూచించారు. పనులు పూర్తయిన తర్వాత వాటిని తొలగించి రబ్బరు టైర్లను అమర్చుకుని తిరిగి రహదారులపై ప్రయాణించాలని తెలిపారు.
ప్రజా ఆస్తులను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రహదారుల సంరక్షణ ద్వారా ప్రభుత్వానికి నష్టం తగ్గించడంతో పాటు ప్రమాదాలను కూడా నివారించవచ్చని శంకర్ నాయక్ పేర్కొన్నారు. జిల్లాలో ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, రైతులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.