కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీసన్
కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీసన్
కేరళ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం వి.డి. సతీసన్ పేరును అధికారికంగా ప్రకటించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిని ఘన విజయం దిశగా నడిపించిన సతీసన్ ఇప్పుడు రాష్ట్ర బాధ్యతలు చేపట్టనున్నారు.
బాల్యం, విద్యాభ్యాసం
1964 మే 31న కొచ్చిలో జన్మించిన సతీసన్ ఉన్నత విద్యను అభ్యసించారు. సోషల్ వర్క్లో ఎంఎస్డబ్ల్యూ పూర్తి చేసిన ఆయన, న్యాయశాస్త్రంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎమ్ పట్టాలు సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు దాదాపు పదేళ్ల పాటు కేరళ హైకోర్టులో న్యాయవాదిగా సేవలందించారు.
విద్యార్థి నాయకత్వం నుంచి సీఎం స్థాయికి
సతీసన్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. కేరళ స్టూడెంట్స్ యూనియన్లో నాయకుడిగా ఎదిగిన ఆయన, అనంతరం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందారు. 2001 నుంచి వరుసగా ఆరు సార్లు పారావూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఎన్నికల్లో ఘన విజయం
ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సతీసన్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమి 140 స్థానాల్లో 102 స్థానాలు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. పారావూర్ నియోజకవర్గంలో సతీసన్ 20,600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ప్రత్యేక గుర్తింపు
అసెంబ్లీలో విషయ పరిజ్ఞానం, ఆధారాలతో మాట్లాడే నేతగా సతీసన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కార్మిక సంఘాలతో సన్నిహితంగా పనిచేస్తూ కార్మికుల సమస్యలపై పోరాడారు. విద్య, ఆరోగ్యం, రోడ్ల అభివృద్ధి రంగాల్లో తన నియోజకవర్గంలో పలు మార్పులు తీసుకొచ్చారు.
అవార్డులు
ఉత్తమ ఎమ్మెల్యే, ఉత్తమ పార్లమెంటేరియన్గా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అలాగే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నుంచి ఉత్తమ రాజకీయ నాయకుడిగా అవార్డు పొందారు.
వ్యక్తిగత జీవితం
సతీసన్ భార్య లక్ష్మీప్రియ. వారికి ఉన్నిమాయ అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం కేరళ కాంగ్రెస్కు వ్యూహకర్తగా, పార్టీని కొత్త దిశగా నడిపిస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు.