కడియం నర్సరీల్లో కలకలం రేపుతున్న ‘యాసిడ్ పురుగులు’.. కూలీలపై దాడులతో ఆందోళన
తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో ఓ వింత పురుగు రైతులు, కూలీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కడియం నర్సరీల్లో గత రెండు నెలలుగా కనిపిస్తున్న ఈ పురుగులు ఇటీవల లక్షల సంఖ్యలో వ్యాపించి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
నర్సరీల్లో పనిచేస్తున్న కూలీలపై ఈ పురుగులు దాడి చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పురుగు శరీరంపై పాకిన ప్రాంతాల్లో పెద్దపెద్ద బొబ్బలు ఏర్పడి, అగ్నిమంటల మాదిరిగా మంట, దురద వస్తోందని బాధితులు చెబుతున్నారు. ఈ బొబ్బలు దాదాపు 20 రోజుల వరకు తగ్గడం లేదని వాపోతున్నారు.
రోజువారీ కూలి పనులపైనే జీవనం సాగించే కార్మికులు పనికి వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఒక్కరోజు పని చేయకపోయినా కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక కూలీలు నర్సరీలకు రావడానికి వెనుకాడటంతో నర్సరీ రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వింత ‘యాసిడ్ పురుగుల’ను నియంత్రించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని రైతులు, కూలీలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.