కడపలో ప్రేమ పెళ్లి పేరుతో యువకుడికి మోసం....
కడపలో ప్రేమ పెళ్లి పేరుతో యువకుడికి మోసం.. రూ.6 లక్షలు తీసుకుని పెళ్లికి డుమ్మా
కడప జిల్లాలో ప్రేమ పెళ్లి పేరుతో ఓ యువకుడిని మోసం చేసిన ఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ.6 లక్షల వరకు డబ్బులు తీసుకుందని వేంపల్లి మండలం కత్తులూరుకు చెందిన వెంకట ప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
కడపకు చెందిన ఎస్తర్ రాణి, వెంకట ప్రసాద్ రెడ్డికి రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగినట్లు సమాచారం. పులివెందుల వెటర్నరీ విభాగంలో పనిచేస్తున్న ఎస్తర్ రాణి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బులు తీసుకుందని యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
పెళ్లి ఏర్పాట్లలో భాగంగా ఇద్దరూ కలిసి హైదరాబాద్లో పెళ్లి దుస్తులు కూడా కొనుగోలు చేసినట్లు బాధితుడు తెలిపాడు. అయితే గండి క్షేత్రంలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన సమయంలో ఎస్తర్ రాణి ఒక్కసారిగా మనసు మార్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
"పెళ్లి చేసుకుంటే తన తల్లి ఉరి వేసుకుంటుందని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది" అని వెంకట ప్రసాద్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు వేంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఎస్తర్ రాణిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.