కంభం: వైసీపీకి యువత గుడ్బై.. టీడీపీలోకి 55 మంది చేరిక
కంభం, కందులాపురానికి చెందిన యువతకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే అశోక్రెడ్డి
కంభం: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలంలో తెలుగుదేశం పార్టీలోకి యువత చేరికలు జరిగాయి. కంభం సహకార సంఘం బ్యాంకు చైర్మన్ కేతం శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కందులాపురం పంచాయతీ, కంభం పట్టణానికి చెందిన 55 మంది యువత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
కందులాపురం మాజీ సర్పంచ్ కల్వకుంట్ల ఇమ్మానియేలు, మాజీ వార్డు సభ్యుడు కటికల మాణిక్యం, అవ్వారి శ్రీనివాసులు, షేక్ షకీల్ తదితరులకు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన యువతకు నాయకులు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై యువత తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని నాయకులు పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో కంభం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.