విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో కూటమి 100 శాతం గెలుపే లక్ష్యం
విజయవాడ ఎన్టీఆర్ భవన్ వేదికగా కూటమి పార్టీల ముఖ్య నాయకుల సమావేశం శనివారం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో పోటీ చేసే అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి 100 శాతం విజయాన్ని సాధించేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త కందుల దుర్గేష్, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్, తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్, సమన్వయ కమిటీ సభ్యురాలు బండి కోమలి, భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ ఇన్చార్జి ఉప్పలపాటి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసే ప్రతి స్థానంలోనూ విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా మూడు పార్టీలు సమన్వయంతో పనిచేయాలని నాయకులు నిర్ణయించారు. అభ్యర్థి కూటమిలో ఏ పార్టీకి చెందిన వారైనా, మిగిలిన రెండు పార్టీలు పూర్తి సహకారం అందించి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. స్థానికంగా ప్రజల సమస్యలు, అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి ప్రచారం, మూడు పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకుని ఎన్నికల బరిలోకి దిగాలని నాయకులు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాను స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం విజయ శాతంతో నిలబెట్టే దిశగా ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.