కొండ నాలుకకు మందు వేస్తే… ఉన్న నాలుక ఊడినట్టు!
కొండ నాలుకకు మందు వేస్తే… ఉన్న నాలుక ఊడినట్టు!
అవగాహన లోపం, నిర్లక్ష్యం రైతుకు ఎంతటి నష్టాన్ని మిగులుస్తుందో మరోసారి బట్టబయలైంది. గుట్టపాలెం గ్రామానికి చెందిన రైతు గంగిరెడ్డి తీవ్రంగా నష్టపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
బెంగళూరు రోడ్డులోని ఎం.వి.ఆర్ సీడ్స్ & ఫర్టిలైజర్ షాప్కు వెళ్లిన గంగిరెడ్డి, తన ఒక ఎకరా టమోటా పంట ఎదుగుదలకు సరైన మందులు ఇవ్వాలని కోరాడు. దుకాణ యజమాని సూచించిన మందులను లీటర్కు ₹1400 చొప్పున కొనుగోలు చేసి పంటపై ఉపయోగించాడు.
అయితే, పంట ఎదుగుదల కోసం ఇవ్వాల్సిన మందుల బదులు పంటను కాల్చే రసాయనాలు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా పచ్చగా వున్న టమోటా పంట పూర్తిగా ఎండిపోయి రైతు తీవ్ర నష్టాన్ని చవిచూశాడు.
ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదని, గతంలో కూడా ఇదే దుకాణం వల్ల పలువురు రైతులు ఇబ్బందులు పడినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
రైతుల డిమాండ్:
దుకాణ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందించాలని రైతులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.