కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల వినతి
కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల వినతి
మంచిర్యాల: గత 25 ఏళ్లుగా పెరగని కోల్ మైన్స్ పెన్షన్ను కరువు భత్యంతో కూడిన 50 శాతానికి పెంచే విధంగా కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. సింగరేణి పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని MNR గార్డెన్లో జరిగిన సమావేశంలో మంత్రికి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. రూ.300 నుండి రూ.1000 లోపు అతి తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి కనీస పెన్షన్ను నెలకు రూ.15 వేలుగా నిర్ణయించాలని, CPRMS మెడికల్ కార్డ్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.
దీంతో పాటు 2016 నాటి రూ.20 లక్షల గ్రాడ్యుటీని చెల్లించాలని, సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ, మారు పేర్ల సవరణ, 12వ వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటును చేపట్టాలని కోరారు. ముఖ్యంగా తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ను కేటాయించిన మాదిరిగానే, సర్వే పూర్తయిన శ్రవణ్పల్లి, RK 6 బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గజెల్లి వెంకటయ్య, రాళ్లబండి రాజన్న, పుదారి నర్సయ్య, ఏ. గంగయ్య, ఎం. అంజయ్య తదితరులు పాల్గొన్నారు