కోటపాడులో కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం కోటపాడు గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. నూజివీడు డీఎస్పీ కెవీవీఎన్వీ ప్రసాద్, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ ఐవి నాగేంద్ర కుమార్ ఆదేశాల మేరకు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు.
దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 4 కోడి పుంజులు, 2 కోడి కత్తులు, రూ.4,400 నగదు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చాట్రాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి. రామకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజలను ఆర్థికంగా నష్టపరిచే జూద క్రీడలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. జూదాన్ని ప్రోత్సహించే వారు లేదా పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూద కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్-112కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.