కరీంనగర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు
కరీంనగర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు: కుళ్ళిన గుడ్లతో కేకుల తయారీ!
కరీంనగర్ :
నగరంలోని రేకుర్తి ప్రాంతంలో ఉన్న 'గణేష్ బెంగళూరు బేకరీ'లో జరుగుతున్న ఆహార కల్తీ బాగోతం వెలుగులోకి వచ్చింది. బేకరీలో విక్రయిస్తున్న ఎగ్ పఫ్స్ నుండి దుర్వాసన వస్తోందని వినియోగదారుల నుండి అందిన ఫిర్యాదు మేరకు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
తనిఖీల్లో వెల్లడైన దిగ్భ్రాంతికర అంశాలు:
కుళ్ళిన గుడ్ల వినియోగం: కేకులు, ఎగ్ పఫ్స్ తయారీ కోసం పాడైన మరియు పగిలిన గుడ్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిల్వ ప్రాంతంలో సుమారు 420 పగిలిన గుడ్లను (14 ట్రేలు) స్వాధీనం చేసుకున్నారు.
పురుగుల మయం: పిండి (మైదా), కేక్ క్రీమ్ మరియు ఫ్రీజర్లో నిల్వ ఉంచిన షుగర్ సిరప్లో పురుగులు పాకుతుండటం అధికారులను విస్మయానికి గురిచేసింది.
అశుభ్రమైన వంటగది: వంటగది ప్రాంతం ఏమాత్రం శుభ్రత లేకుండా, ఈగలతో నిండిపోయి అత్యంత దారుణంగా ఉంది.
భారీగా నిల్వల ధ్వంసం: పగిలిన గుడ్లతో తయారు చేసిన రూ. 7,000 విలువైన కేకులతో పాటు, మొత్తం రూ. 9,000 విలువైన పాడైన ఆహార పదార్థాలను అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
లైసెన్స్ రద్దు - కఠిన చర్యలు:
ఆహార భద్రతా ప్రమాణాలను తీవ్రంగా ఉల్లంఘించినందుకు గాను సదరు బేకరీ FSSAI లైసెన్స్ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. లోపాలను సరిదిద్దే వరకు బేకరీని నిర్వహించకూడదని ఆదేశించారు. అంతేకాకుండా, ఫుడ్ సేఫ్టీ చట్టం-2006 ప్రకారం యాజమాన్యంపై అడ్జుడికేషన్ చర్యలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.