కరెంట్ పోయిందా? ఇక వాట్సప్లోనే ఫిర్యాదు..
కరెంట్ పోయిందా? ఇక వాట్సప్లోనే ఫిర్యాదు.. తెలంగాణ విద్యుత్ శాఖ సరికొత్త సేవలు
హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. కరెంట్ కోతలు, లో-వోల్టేజ్, ట్రాన్స్ఫార్మర్ లోపాలు, విద్యుత్ సరఫరా అంతరాయాల వంటి సమస్యలను ఇక నుంచి నేరుగా వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తూ టీజీఎస్పీడీసీఎల్ (TGSPDSL) సరికొత్త సేవలను ప్రారంభించింది.
వినియోగదారుల సౌకర్యార్థం ప్రాంతాల వారీగా ప్రత్యేక వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేస్తోంది. ఈ గ్రూపుల ద్వారా సంబంధిత లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సహాయ ఇంజనీర్ (ఏఈ)లను నేరుగా సంప్రదించి విద్యుత్ సమస్యలను వెంటనే తెలియజేయవచ్చు. దీంతో ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగ్గి, వేగంగా స్పందించే అవకాశం ఏర్పడనుంది.
ఇప్పటివరకు విద్యుత్ సమస్యల కోసం వినియోగదారులు ప్రధానంగా 1912 కాల్ సెంటర్పై ఆధారపడేవారు. అయితే కొత్త వాట్సప్ సేవలతో ఫిర్యాదులను మరింత వేగంగా స్వీకరించి, తక్షణ చర్యలు తీసుకోవడమే విద్యుత్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కొత్త విధానం అమల్లోకి రావడంతో విద్యుత్ కోతలు, మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ లోపాలు, లో-వోల్టేజ్ వంటి సమస్యల పరిష్కారం మరింత సులభం కానుందని అధికారులు తెలిపారు. వినియోగదారులు తమ ప్రాంతానికి సంబంధించిన వాట్సప్ గ్రూపులో చేరి అవసరమైనప్పుడు నేరుగా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.