కృష్ణలంకలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం.. తండ్రి, కుమారుడిపై దారుణ దాడి
విజయవాడ కృష్ణలంకలో సోమవారం రాత్రి బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. కరకట్టపై శిశుభవన్ సమీపంలో తండ్రి, కుమారుడిపై దుండగులు బ్లేడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
స్థానికుల వివరాల ప్రకారం కృష్ణలంకకు చెందిన భాను, ఆయన కుమారుడిపై చెక్క కుమార్ అనే వ్యక్తి బ్లేడ్తో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, బాలుడి గొంతు భాగంలో తీవ్రమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గాయపడిన వారిని తొలుత కృష్ణలంకలోని శ్రీరామ్ ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
దుండగులు గంజాయి మత్తులో ఈ దాడికి పాల్పడ్డారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. కరకట్ట పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలు, నిందితుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.