కష్టపడింది కార్యకర్తే… ఫలితం మరొకరికి ఎందుకు?
కష్టపడింది కార్యకర్తే… ఫలితం మరొకరికి ఎందుకు? — పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి
ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోరాడింది సామాన్య కార్యకర్తేనని అన్నారు. అధికారం దరిదాపుల్లో లేని రోజుల్లో జెండా మోసింది కూడా అతడేనని పేర్కొన్నారు.
అయితే, ఈరోజు అధికారం రాగానే ఎక్కడో నుంచి వచ్చిన వారు వెన్నుముక్కలా నటిస్తుండటంతో అసలైన కార్యకర్త గుండె రగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడేవారికి ఒక నీతి, అవకాశవాదులకు మరో నీతి ఎందుకని ప్రశ్నించారు.
ఎవరికీ తెలియని వ్యక్తులను తీసుకువచ్చి కార్యకర్తలపై రుద్దడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ఇది కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు.
నిన్నటి వరకు వైసీపీలో ఉండి, ఈరోజు టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారి ఫీడ్బ్యాక్ ఆధారంగా పదవులు పంచడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తల కంటే, ఫోన్ కాల్స్లో వచ్చే అజ్ఞాత అభిప్రాయాలకు అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందా అని ప్రశ్నించారు.
అధిష్టానం నమ్మకమైన కేడర్ను పక్కనపెట్టి అవకాశవాదులకు పెద్దపీట వేస్తే రేపు పార్టీకి అండగా నిలిచే బలం తగ్గిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు.