కుమారుడిని చంపి.. మిస్సింగ్ అంటూ కోర్టుకెక్కిన తల్లి!
కర్నూలు జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ తల్లి తన ప్రియుడితో కలిసి కన్న కుమారుడినే హత్య చేసి, అనంతరం అతడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక హైకోర్టును కూడా ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కౌతాళం మండలం బదినేహాలు గ్రామానికి చెందిన గంగమ్మకు, బంధువైన దర్గప్పతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తరచూ ఇంటికి వస్తున్న దర్గప్పను గంగమ్మ పెద్ద కుమారుడు వీరేశ్ (17) తీవ్రంగా వ్యతిరేకించడంతో, అతడిని అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ కుట్ర పన్నారు.
2024 నవంబరులో ఇంట్లోనే వీరేశ్ను కత్తితో పొడిచి హత్య చేసిన నిందితులు, మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి బైక్పై తీసుకెళ్లి సమీప శ్మశానవాటికలో పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది.
అంతేకాక, తన కుమారుడు కనిపించడం లేదంటూ గంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు పురోగతి లేదంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది.
సిట్ విచారణలో అసలు నిజం బయటపడింది. గంగమ్మ, దర్గప్ప కలిసి వీరేశ్ను హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు, శ్మశానవాటికలో పాతిపెట్టిన అస్థిపంజరాన్ని వెలికితీశారు. అక్కడ లభించిన దుప్పటి, టవల్, తాడు వంటి వస్తువులను కుటుంబ సభ్యులు వీరేశ్వేనని గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.
ఇదిలా ఉండగా, కేసు మలుపు తిరిగిన సమయంలోనే గంగమ్మ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం మరో సంచలనంగా మారింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, ఆమె మరణంపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.
వీరేశ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్గప్పను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. తల్లి చేతిలోనే కుమారుడు బలైపోవడం, ఆ తర్వాత మిస్సింగ్ నాటకం ఆడి కోర్టు వరకు వెళ్లడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.