ప్రప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతి ఘనంగా నిర్వహణ
ప్రప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతి ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం లోని పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంగళ్ పాండే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, మంగళ్ పాండే 1827 జూలై 19న ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లా నగ్వా గ్రామంలో జన్మించారని తెలిపారు. 1849లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరిన ఆయన, 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించి భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామానికి నాంది పలికారని వివరించారు.
బ్రిటిష్ పాలకులు తుపాకీ తూటాలపై ఆవు, పంది కొవ్వు పూత ఉండే కార్ట్రిడ్జ్లను నోటితో కొరికి ఉపయోగించాలని విధించిన విధానాన్ని మత విశ్వాసాలకు విరుద్ధమని భావించి మంగళ్ పాండే తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. ఆ నిరసనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలి సాయుధ పోరాటానికి దారితీసిందని పేర్కొన్నారు.
బ్రిటిష్ ప్రభుత్వం మంగళ్ పాండేను అరెస్టు చేసి 1857 ఏప్రిల్ 8న ఉరిశిక్ష అమలు చేసిందని, ఆయన త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి తర్వాతి తరాల స్వాతంత్ర్య సమరయోధులైన నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తదితరులకు స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.