వర్షాలు కురవాలని పెనుగొలనులో చండీశ్వరుడికి అభిషేకం – నగర సంకీర్తన
వర్షాలు కురవాలని పెనుగొలనులో చండీశ్వరుడికి అభిషేకం – నగర సంకీర్తన
జూలై 19: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆదివారం భక్తులు శివాలయం ప్రాంగణంలోని చండీశ్వరుడికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం మారేడు దళాలతో ప్రత్యేక పూజలు చేశారు.
చండీశ్వరుడిని ఆరాధించడం వల్ల భక్తులకు సకల కార్యసిద్ధి, శివానుగ్రహం లభిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు.
అంతకుముందు సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో శివాలయం నుంచి భగవన్నామ స్మరణతో నగర సంకీర్తన ప్రారంభమైంది. రేడియో రూము, వాటర్ ట్యాంక్ రోడ్డు, బస్టాండ్, బొడ్రాయి సెంటర్, రామాలయం మీదుగా సాగిన సంకీర్తన షిరిడి సాయిబాబా మందిరానికి చేరుకుంది.
ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, సుగ్గల విష్ణు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా, పెనుగొలను బొడ్రాయి సెంటర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఏకశిల విగ్రహానికి శనివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసినట్లు నిర్వహణ కమిటీ సభ్యులు బొలగాలి నాగయ్య, కోట దాసు తెలిపారు.