కుటుంబం అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ నిజాలు.. 38 కత్తిపోట్లతో నలుగురి హత్య!
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి చెందిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజమిల్ (20), కుమార్తె అక్సర (11) మృతదేహాలపై నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో వీరిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తేలింది.
నివేదిక ప్రకారం సుల్తాన్ శరీరంపై 6 కత్తిపోట్లు, హసీనాకు 7 కత్తిపోట్లు, అక్సరకు 9 కత్తిపోట్లు ఉండగా, ముజమిల్పై ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 38 కత్తిపోట్లతో నలుగురినీ హతమార్చినట్లు అధికారులు నిర్ధారించారు.
ఈ హత్యలను ప్రొఫెషనల్ కిల్లర్లే చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు నిందితులకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు.
ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపగా, కుటుంబ సభ్యులను ఇంత క్రూరంగా హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.