క్విట్ ఇండియా డే సందర్భంగా జైల్ భరో విజయవంతం చేయండి: ఏఐకేఎం పిలుపు
ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: క్విట్ ఇండియా డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 9న దేశవ్యాప్తంగా నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐకేఎం రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లాల సమావేశం విస్సన్నపేటలో దుర్గం పుల్లారావు అధ్యక్షతన నిర్వహించారు.
సమావేశంలో హరినాథ్ మాట్లాడుతూ అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల భారత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు సీ2 + 50 శాతం కనీస మద్దతు ధర అమలు చేయాలని, నూతన విద్యుత్ చట్టం–2025ను రద్దు చేయాలని కోరారు.
అలాగే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, అసంఘటిత కార్మికులకు నెలకు రూ.36 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి తగిన సహాయ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
మెట్ట ప్రాంతానికి వరప్రదాయినిగా భావిస్తున్న చింతలపూడి ఫేజ్–2 ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని, కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసే ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉన్న రైతులకు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అటవీ భూములకు సంబంధించిన నాలుగో నోటిఫికేషన్ను కూడా రద్దు చేయాలని కోరారు.
"వ్యవసాయాన్ని – భూమిని – రైతును కాపాడుకుందాం" అంటూ పిలుపునిచ్చిన హరినాథ్, జైల్ భరో కార్యక్రమంలో రైతులు, కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, ఏఐసీసీటీయూ కార్యదర్శి వేముల బక్కయ్య, జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, కలపాల వెంకటేశ్వరరావు, భవాని, పీక లావతి, భూతం మారయ్య తదితరులు పాల్గొన్నారు.