క్యాన్సర్ చికిత్సలో ఆశాకిరణం 'రోబోటిక్ సర్జరీ
మూడవ దశ క్యాన్సర్కు కూడా అధునాతన వైద్యంతో చెక్
చిన్న కోతతో సర్జరీ.. త్వరగా కోలుకునే అవకాశం
మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. రాజేష్ గౌడ్
మంచిర్యాల (జిల్లా కేంద్రం):
క్యాన్సర్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానమైన 'రోబోటిక్ సర్జరీ' ఒక ఆశాకిరణంగా మారిందని యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మినిమల్ ఇన్వేసివ్ & రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సర్జరీ ద్వారా సాధిస్తున్న విప్లవాత్మక పురోగతిని, దాని ప్రయోజనాలను విలేకరులకు వివరించారు.
ముఖ్యంగా మూడవ దశ (3rd Stage) క్యాన్సర్లను సైతం రోబోటిక్ సర్జరీ ద్వారా అత్యంత సమర్థవంతంగా జయించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గర్భాశయ, రొమ్ము, ఛాతీ, పెద్దప్రేగు, పిత్తాశయం తదితర భాగాలలో వచ్చే క్యాన్సర్లకు ఈ విధానం ద్వారా విజయవంతమైన ఫలితాలను సాధిస్తున్నట్లు సోదాహరణంగా వివరించారు. సంప్రదాయ శస్త్రచికిత్సల కంటే ఈ పద్ధతిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
రోబోటిక్ సర్జరీతో ముఖ్య ప్రయోజనాలు:
చిన్న గాయాలు: ఈ విధానంలో కోత చాలా చిన్నదిగా ఉండటం వల్ల రోగికి నొప్పి చాలా తక్కువగా ఉంటుంది.
సమయం ఆదా: సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా తక్కువ సమయంలో, అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేయవచ్చు.
త్వరితగతిన కోలుకోవడం: సర్జరీ అనంతరం రోగులు ఆసుపత్రి నుంచి అత్యంత త్వరగా కోలుకుని తమ దైనందిన జీవితాల్లోకి అడుగుపెట్టవచ్చు.
సకాలంలో గుర్తిస్తేనే ప్రాణాలకు రక్ష:
క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ గౌడ్ ఇ. ఉద్ఘాటించారు. వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, సకాలంలో సరైన వైద్య నిపుణులను సంప్రదించకపోతే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ప్రజల్లో క్యాన్సర్ చికిత్సలు, రోబోటిక్ సర్జరీ ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ మీడియా సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అధునాతన సాంకేతికత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని పేర్కొన్నారు