లైసెన్స్, అమెండ్మెంట్లు లేని డీలర్లపై కఠిన చర్యలు -విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ హెచ్చరిక
ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం కలగర గ్రామంలోని ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా షాపుల్లో నిర్వహిస్తున్న స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, నూతనంగా సర్టిఫై చేశారు. పాత స్టాక్స్కు సంబంధించిన ఎంట్రీలు, విక్రయ రికార్డులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
డీలర్లందరూ తమ లైసెన్సులు, ఓ-ఫారమ్లు, ఇతర అవసరమైన అమెండ్మెంట్లు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఆమె ఆదేశించారు. లైసెన్స్ లేదా అమెండ్మెంట్లు లేకుండా ఎరువులు, పురుగుమందులు, విత్తనాల విక్రయాలు నిర్వహిస్తే సంబంధిత డీలర్లపై ఎరువులు, పురుగుమందులు మరియు విత్తనాల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందేలా అధికారులు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తారని మండల వ్యవసాయాధికారి తెలిపారు.