లింగపాలెం గ్రామంలో రహదారి ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ప్రారంభం
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు ప్రారంభించారు. రోడ్డు సెంటర్ నుండి సుమారు 25 అడుగుల పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ, భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి, రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామస్తుల సహకారంతో ఈ పనులు కొనసాగుతున్నాయి.
రోడ్లు మరియు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ సుందర్ రావు మాట్లాడుతూ, ప్రధాన రహదారులు ఆక్రమణలకు గురికాకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.